ప్రత్యేక తెలంగాణకు అజిత్ మద్దతు
హైదరాబాద్: రాష్ట్రీయ లోక్దళ్ అధ్యక్షుడు, ఇటీవల ఎన్డీఎ కూటమి నుంచివిడిపోయి సంచలనం సృష్టించిన రాజకీయ నేత అజిత్ సింగ్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటునకు తన సంపూర్ణమద్దతును ప్రకటించారు. సోమవారంహైదరాబాద్ వచ్చిన అజిత్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ..ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం పనిచేసే తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు ఇతర భావసారూప్య పార్టీలన్నింటికి తమ పార్టీమద్దతు ఇస్తుందని తెలిపారు.
బీజేపీపై ఆయన విరుచుకుపడ్డారు. గత ఎన్నికలసందర్భంగా ప్రత్యేక తెలంగాణ వాగ్దానం చేసిన బీజేపీ ఇప్పుడుమాటమార్చి విమర్శలు గుప్పించి తన అసలు రంగును బయటపెట్టుకుంటుందని విమర్శించారు. ఇటీవల తనపై బీజేపీ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. బీజేపీ విదర్భ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును తన మ్యేనిఫెస్టోలో ప్రకటించిందన్న విషయం వెంకయ్య మర్చిపోయినట్లున్నారని ఆయన ఎద్దేవా చేశారు.