4గురు మంత్రులపై లోకాయుక్తా కన్ను
విజయవాడ: రాష్ట్రమంత్రివర్గానికి చెందిన నలుగురు మంత్రుల అవినీతి కార్యకలాపాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు రాష్ట్ర లోకాయుక్తా ప్రకటించింది. వీరితో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక జిల్లా పరిషత్ ఛైర్మన్ పై కూడా లోకాయుక్తా కన్నేసింది. ప్రాథమిక స్థాయి దర్యాప్తులో ఆధారాలు లభిస్తే వీరిపై పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభిస్తామని లోకాయుక్తా జస్టిస్ రామానుజన్ తెలిపారు. మంగళవారం విజయవాడలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అయితే, ఈ నలుగురు మంత్రుల వివరాలు వెల్లడించే అధికారం లోకాయుక్తాకు లేదని ఆయన తెలిపారు.
ప్రజలు తమకు తెలిసిన సమాచారాన్ని, అవినీతికి పాల్పడ్డ రాజకీయ నాయకుల వివరాలను లోకాయుక్తాకు తెలిపితే..వారిపై దర్యాప్తు చేస్తామని ఆయన అన్నారు. వివరాలు తెలిపిన వారికి అవసరమైతే భద్రతా కల్పిస్తామన్నారు. ప్రజలు భయపడకుండా అవినీతి నిర్మూలనలో లోకాయుక్తా సాయపడాలని ఆయన పిలుపునిచ్చారు. లోకాయుక్తాకు మరిన్ని అధికారాలు కావాలని జస్టిస్ రామానుజన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దర్యాప్తులో ఆధారాలు దొరికిన వ్యక్తులను శిక్షించేఅధికారామూ లోకాయుక్తాకు కట్టబెట్టాలని ఆయనకోరారు.