పుష్కరాలపై సమావేశం, రసాభసా
రాజమండ్రి: గోదావరి పుష్కరాల అభివృద్ది కార్యక్రమాల గురించి చర్చించేందుకు రాజమండ్రిలో ఏర్పాటైన సమావేశం రసాభసాగా మారింది. తెలుగుదేశం, కాంగ్రెస్ నాయకుల వాగ్వివాదం, తోపులాటతో గంటసేపు సమావేశం ఉద్రిక్తతంగా మారింది. అర్ధాంతరంగానే ముగిసింది.
రాజమండ్రి వద్ద దాదాపు 80 కోట్ల రూపాయలతో పుష్కారాల ఏర్పాట్లను చేస్తున్నారు.వీటిలో అవకతవకలు జరుగుతున్నాయని కొద్ది రోజులుగా ఆరోపణలువినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటి ఏర్పాట్లు, కార్యక్రమాల గురించి ప్రజాప్రతినిధులు, కార్పోరేటర్లు, అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
సమావేశం మొదలైన కొద్దిసేపటికి కాంగ్రెస్, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వివాదం ప్రారంభమైంది. రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతుండగా, కడియం ఎమ్మెల్యే(కాంగ్రెస్) జక్కంపూడి రామ్మోహనరావు కలగచేసుకొని నిధుల వ్యయంపై నిలదీశారు. వెంటనే కాంగ్రెస్ సభ్యులు, టీడీపీ సభ్యులు ఒకరిపైఒకరు విమర్శలు చేసుకుంటూ...గొడవకుదిగారు.
అరుపులు, కేకలతో సభ ఉద్రిక్తంగా మారింది జక్కంపూడి కుర్చీ, టేబుల్ పై ఉన్న గ్లాస్ ను కింద పడేయడంతో గొడవ మరింత ముదిరింది. తోపులాట జరిగింది. ఒక దశలో ఒకరినొకరు కొట్టుకుంటారేమోన్నంతగా ఘర్షణ జరిగింది. కలెక్టర్ ఇరు వర్గాలను శాంతపర్చేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. అల్లుబాబు అనే కార్పోరేటర్ ఈ తోపులాటలో స్పృహతప్పిపడిపోవడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు.