బాబు ఆధునిక వ్యవసాయ పాఠాలు
విశాఖపట్నం: రైతులు ఆధునిక వ్యవసాయ పద్దతులు అవలంభించి నష్టాలను నివారించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. జన్మభూమి కార్యక్రమలంలో భాగంగా ఆయన విశాఖ జిల్లా అడవి అగ్రాహారం గ్రామంలో ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించారు.
ముఖ్యమంత్రి సభాస్థలికి చేరుకునే సమయానికి ముందే వర్షం మొదలైంది. అయనా, ప్రజలు, రైతులు ఆయన కోసం అలాగే వేచి ఉన్నారు. ముఖ్యమంత్రి కూడా వర్షంలో తడుస్తూనే ప్రసంగించారు. ఆయన మైక్ అందుకున్న వెంటనే రైతులకు ఆధునిక పాఠాలు మొదలుపెట్టారు.
దుక్కి దున్నినప్పుట్నుంచే ఆధునిక పద్దతులు మొదలుపెట్టండి. భూసార పరీక్ష నిర్వహించండి. దాన్ని బట్టే మీరు విత్తనాలు సెలక్ట్ చేసుకొండి...అంటూ వరుసగా బాబు రైతులకు సూచనలు ఇచ్చారు. తమ ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని, అందుకే ఈ జన్మభూమిని రైతు-మహిళ జన్మభూమిగా ఏర్పాటుచేశామన్నారు.
కరవుతో సతమతమవుతోన్న రైతులకు ఊరటనిచ్చేందుకే ఈ ఏడాది దాదాపు 500 కోట్లకు పైగా సహకార రుణాల వడ్డీని మాఫీ చేసినట్లు ఆయన చెప్పారు.