పులిచింతల కోస్తాదే కాదు: కోడెల
గుంటూరు: కృష్ణానదిపై తలపెట్టిన పులిచింతల ప్రాజెక్టు వల్ల కోస్తా ప్రాంతానికే మేలు జరుగుతుందనే వాదనను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఖండించారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు కూడా మేలు జరుగుతుందని ఆయన శనివారం ఇక్కడ విలేకరుల సమావేశంలో అన్నారు.
వృధా అవుతున్న 45 టిఎంసిల నీరు ఈ ప్రాజెక్టు నిర్మిస్తే ఉపయోగంలోకి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. 80 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రాజెక్టు వల్ల నల్లగొండ, కృష్ణా జిల్లాల్లో భూగర్భ జలాల మట్టాలు పెరుగుతాయని ఆయన అన్నారు. నాగార్జున సాగర్ వద్ద విద్యుదత్పత్తికి వాడిన నీరు వృధాగా సముద్రంలో కలిసిపోకుండా ఆ నీటిని నిల్వ చేయడానికి పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల కోస్తాలో అదనంగా ఒక ఎకరం కూడా సాగులోకి రాదని ఆయన అన్నారు.