ఆర్డిఎస్పై రాస్తారోకో- ఉద్రిక్తత
హైదరాబాద్: రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డిఎస్) నుంచి మహబూబ్నగర్కు రావాల్సిన నీటి వాటాను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి చేపట్టిన రాస్తారోకో ఉద్రిక్తతకు దారి తీసింది. మహబూబ్నగర్ జిల్లా ఎర్రబల్లి వద్ద ఏడో నెంబర్ జాతీయ రహదారిపై ఈ రెండు పార్టీల కార్యకర్తలు సోమవారం ఆరు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు.
జిల్లా అధికారులు, పోలీసులు ఎంత చెప్పినా ఆందోళనకారులువినలేదు. దీంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జి చేశారు. ఇందులో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షకార్యదర్శులతో పాటు పది మంది గాయపడ్డారు. అనంతరం పోలీసులు 200 మందినిఅరెస్టు చేశారు. వీరిని ఇటిక్యాల పోలీసు స్టేషన్కు తీసికెళ్లి కేసు నమోదు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.అరెస్టయినవారిలో కాంగ్రెస్ నాయకులు మల్లురవి, భరతసింహారెడ్డి, తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్, టిఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు మహబూబ్నగర్ జిల్లా బంద్ ప్రశాంతంగా జరిగింది. దాదాపు సంపూర్ణంగా జరిగింది. వాణిజ్య సంస్థలను, దుకాణాలను మూసివేశారు. టిఆర్ఎస్ కార్యకర్తలు జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాల్లో కూడా వివిధ కార్యక్రమాలు చేపట్టారు. నల్లగొండ జిల్లాలో టిఆర్ఎస్ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. వరంగల్లో నిరసన ప్రదర్శన జరిపారు. ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు 60 మంది టిఆర్ఎస్ కార్యకర్తలనుఅరెస్టు చేశారు.