ఎమ్మెస్ సాక్షిగా కార్యకర్తల తగాదా
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు ఎం. సత్యనారాయణ రావు సాక్షిగా పార్టీ రంగారెడ్డి జిల్లా నాయకులు రెండుగా విడిపోయి ఘర్షణకు దిగారు. రంగారెడ్డి జిల్లా పార్టీ శిక్షణా శిబిరం ఏర్పాటు సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఈ ఘర్షణ చోటు చేసుకుంది.
శిక్షణా శిబిరం సందర్భంగా ఏర్పాటయిన ఫొటో ఎగ్జిబిషన్లో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్పి) నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి, శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి ఫొటోలు లేకుపోవడంపై ఒక వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్వాహకులను నిలదీసింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.ఎం. సత్యనారాయణ రావు అక్కడికి చేరిన తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. ఫొటోలు పెట్టకపోవడం పొరపాటేనని, ఇటువంటి పొరపాటు జరగకుండా చూస్తామని పిసిసి ప్రధాన కార్యదర్శిపి. సుధాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో గొడవ సద్దుమణిగింది.