ఇరాక్కు బలగాలు పంపం: భారత్
న్యూఢిల్లీ: అమెరికా ఆదేశాల మేరకు ఇరాక్కు తమ బలగాలను పంపకూడదని, ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో మాత్రమే పంపాలని భారత భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నిర్ణయించింది. ప్రధాని అటల్బిహారీ వాజ్పేయి అధ్యక్షతన జరిగిన సిసిఎస్ సమావేశంలోని ఇరాక్లోని పరిస్థితిని క్షుణ్నంగా పరిశీలించారు.
ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ, రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్, విదేశీ వ్యవహారాల మంత్రి యశ్వంత్ సిన్హా, ఆర్థిక మంత్రి జస్వంత్సింగ్, ప్రణాళికా సంఘం చైర్మన్ కె.సి. పంత్, జాతీయ భద్రతా సలహాదారు బ్రజేష్మిశ్రా సమావేశంలో పాల్గొన్నారు.
ఇరాక్కు బలగాలను పంపకూడదని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఎ) ప్రభుత్వ ప్రధాన భాగస్వామ్య పార్టీ బిజెపితో పాటు పలు రాజకీయ పార్టీల నుంచి డిమాండ్ వచ్చిన నేపథ్యంలో సిసిఎస్ ఆ నిర్ణయం తీసుకుంది. ఇరాక్కు బలగాలను పంపాలని అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ చేసినవిజ్ఞప్తిపై దాదాపు నెల రోజుల పాటు తర్జనభర్జనలు జరిగాయి. సమావేశానంతరం సిన్హా ఒక ప్రకటనను చదివివినిపించారు. స్థిరత్వానికి, భద్రతకు, రాజకీయ ప్రగతికి, ఆర్థిక పునర్నిర్మాణానికి ఇరాకీ ప్రజలకు అత్యంత అవసరమైనవాటిని తీర్చేందుకు భారత్ ప్రతిస్పందిస్తుందని ప్రకటనలో స్పష్టం చేశారు.