ఆరోగ్య కార్యక్రమం నిరంతరాయం: బాబు
హైదరాబాద్: ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమం నిరంతరాయంగా సాగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. ఆయన శనివారంనాడు హైదరాబాద్లోని పలు మురికివాడల్లో పర్యటించి పారిశుధ్య పరిస్థితులను, నీటి నల్లాలను పరిశీలించారు.
రాష్ట్రంలో అంటువ్యాధుల నివారణకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాన్ని ఇక ముందు కూడా కొనసాగిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో వ్యాధులు అదుపులోకి వచ్చాయని ఆయన అన్నారు. వచ్చే ఐదు నెలల పాటు వర్షాకాలం ప్రభావం ఉంటుందని,అందువల్ల వ్యాధుల నిరోధానికి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని పిల్లలకు సోకిన వ్యాధిని ఢిల్లీ నుంచి వచ్చిన వైద్యులు ఇంకా నిర్ధారించలేకపోయారని ఆయన చెప్పారు.
జంటనగరాల్లోని మురికివాడల పారిశుధ్యానికి ఆయన 30 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో మేయర్, కమీషనర్, ఇతర ఉన్నతాధికారులు ప్రతి శుక్రవారం సందర్శించి, తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి 15 రోజలకు ఒకసారి తాను కూడా ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తానని ఆయన చెప్పారు.