అయోధ్యపై చర్చలే ఉత్తమం: అద్వానీ
రాయ్పూర్: అయోధ్య వివాద పరిష్కారానికి సంప్రతింపులే ఉత్తమ మార్గమని ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ అభిప్రాయపడ్డారు. అయోధ్య సమస్య పరిష్కారానికి చట్టం తేవడానికి మార్గాలు అన్వేషిస్తున్నామని భారతీయ జనతా పార్టీ (బిజెపి) కార్యవర్గం ప్రకటించిన మర్నాడే అద్వానీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. బిజెపి కార్యవర్గ సమావేశం ముగింపు సమావేశంలో ఆదివారం ఆయన ప్రసంగించారు.
పార్లమెంటులో సంఖ్యాబలం దృష్ట్యా చట్టం తేవడంపై ఇంతకు ముందు కూడా అద్వానీ సందేహం వ్యక్తం చేశారు. పలు ముస్లిం సంస్థలు, వ్యక్తులు అయోధ్యవివాద పరిష్కారం గురించి మాట్లాడుతున్నట్లు,అందువల్ల ఈ వివాదంలో కొంత వెసులుబాటు లభించినట్లు ఆయన తెలిపారు. ఈ స్థితిలో చర్చల ద్వారావివాదాన్ని పరిష్కరించుకోవడం ఉత్తమ మార్గమని, ఈ పరిష్కారం వల్ల ఉద్రిక్తతలు రూపుమాసిపోతాయని ఆయన అన్నారు.
అమెరికాలో సెప్టెంబర్ 11 దాడుల అనంతరం పలు ఇస్లామిక్ దేశాలు, వ్యక్తులు తీవ్రవాదానికి దూరం జరగడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. మన ప్రజాస్యామ్యానికి పలు బలమైనఅంశాలున్నాయని, అందరికీ ఇది చోటు కల్పిస్తుందని,అందువల్లనే ఒక్క భారతీయుడు కూడా ఆల్ ఖైదాతో కలిసి లేడని ఆయన అన్నారు.