ప్రాజెక్టులపై లొంగేవరకు పట్టు: టిడిపిపి
హైదరాబాద్: కర్ణాటక కృష్ణా, మంజీరా నదులపై అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఆపేయించేంత వరకు పార్లమెంటులో పట్టుబట్టాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టిడిపిపి) నిర్ణయించుకుంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఆదివారం జరిగిన టిడిపిపి సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
సోమవారం ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు టిడిపిపి నేత ఎర్రంనాయుడు సమావేశానంతరంవిలేకరుల సమావేశంలో చెప్పారు. కృష్ణ, మంజీరా నదులపై ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర జలసంఘం ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టుబట్టాలని, ఈవిషయంలో కేంద్రం నుంచి స్పష్టమైన హామీ పొందే వరకు పోరు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.
అయోధ్య విషయంలో కోర్టు తీర్పే అన్ని పక్షాలకుశిరోధార్యం కావాలని ఆయన అన్నారు. అయోధ్య వివాదం జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఎ) కనీస ఉమ్మడి ఎజెండాలో లేదని,అందువల్ల ఈ విషయాన్ని చర్చించడానికి గానీ, బిల్లు ప్రతిపాదించడానికి తాము సహకరించబోమని ఆయన చెప్పారు. రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డియస్) కింద రైతులకు పూర్తి స్థాయిలో నీరుఅందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబునాయుడు చెప్పారు.