గోదావరి పుష్కరాలకు అంతా సిద్దం
రాజమండ్రి: గోదావరి వరదలు తగ్గుముఖం పడుతుండడంతో పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత రెండు రోజుల వరదలకు పలు స్నానఘట్టలు కొట్టుకుపోయాయి. వాటిని తిరిగి మరమ్మతులు జరిపిస్తున్నారు. బుధవారం నాటి పుష్కరాల ప్రారంభానికి అంతా సిద్దంగా ఉన్నట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కె.ఎస్.జహవరరెడ్డి తెలిపారు.
వరదలు మరో 24 గంటల్లో పూర్తిగా తగ్గుముఖం పడుతాయని, కాబట్టి ఆందోళన చెందాల్సిన పనేమీ లేదని ఆయన వివరించారు. ప్రధానంగా రద్దీ ఉండే కొవ్వూరులో స్నానఘట్టాలకు ఎటువంటి ఇబ్బంది లేదని స్థానిక ఆర్డీవో శ్రీధర్ చెప్పారు.
వరదలు తగ్గినట్లే. వరదల వల్ల బురద ఏర్పడింది. బురద ఉన్న చోట తిరిగి ఒక పొర మట్టి కప్పుతున్నాం. కాబట్టి ఇబ్బంది లేదని ఆయన తెలిపారు. బుధవారం మధ్యాహ్నం రాజమండ్రిలో ముఖ్యమంత్రి పుష్కరస్నానం చేస్తారు. భద్రాది వద్ద గవర్నర్ సూర్జీత్ సింగ్ భర్నాలా పుష్కరాలను ప్రారంభిస్తారు.