కోనేరులో శవమై తేలిన సమ్మిరెడ్డి
హైదరాబాద్: కొద్ది రోజుల క్రితం అదృశ్యమైన మాజీ నక్సలైట్ బయ్యపు సమ్మిరెడ్డి కృష్ణా జిల్లా మైలవరపు వద్ద ఓ కోనేరులో శవమై తేలాడు. కోనేరులో తేలుతోన్న శవాన్ని మైలవరపు పోలీసులు వెలికి తీసి, సమ్మిరెడ్డి బంధువులను పిలిపించారు. ఆ మృతదేహాన్ని సమ్మిరెడ్డిదిగా ఆయన బంధువులు సోమవారం గుర్తించారు. మైలవరం వద్ద కోనేరులోని గోనే సంచిలో మూటకట్టి ఉన్న ఓ శవాన్ని స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సమ్మిరెడ్డి బంధువులకు సమాచారం అందించారు.
సోమవారం వారు అది సమ్మిరెడ్డిదిగానే గుర్తించారు. సంచలనం సృష్టించిన సమ్మిరెడ్డి అదృశ్యం కేసు కొద్ది రోజులుగా మలుపు తిరుగుతూ వస్తోంది. అయితే, ఆయన హత్యకు కారకులు ఎవరూ అనేది పోలీసులకు అంతుచిక్కడం లేదు. మాజీ నక్సలైట్ అయిన సమ్మిరెడ్డి పీపుల్స్ వార్ ను అంతమొందించేంతవరకు నిద్రపోనని శపథం చేశాడు.
కొద్ది రోజుల క్రితం ఆయన కిడ్నాప్ నకు గురైడయ్యాడని వారు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ వద్ద పని మీద వెళ్ళిన సమ్మిరెడ్డి కారు జగ్గయ్యపేట వద్ద లభించడంతో ఆయన కిడ్నాప్ నకు గురైడయ్యాడని భావించారు.