రాజీనామాకైనా సిద్ధమే, కానీ... : వాజ్పేయి
న్యూఢిల్లీ: తాను రాజీనామా చేయడానికైనా సిద్ధపడుతాను గానీ ఒత్తిళ్లకు లొంగబోనని ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అన్నారు. అయోధ్యపై తాను చేసిన ప్రకటన మీద విపక్షాలు సోమవారం లోక్సభలో తీవ్రంగా ధ్వజమెత్తాయి. విపక్షాల విమర్శలకు ప్రతిస్పందిస్తూ ప్రధాని ఆ విధంగా అన్నారు.
అయోధ్య వివాదంపై ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు. రామజన్మభూమి న్యాస్ అధ్యక్షుడు రామచంద్రదాస్ పరమహంస అంత్యక్రియల సందర్భంగా అయోధ్యలో రామాలయం నిర్మిస్తామని ప్రకటించాల్సిన అనివార్యతలో ప్రధాని పడ్డారని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పి) నేత ములాయం సింగ్ అన్నారు. దీనికి తీవ్రంగా ప్రతిస్పందిస్తూ అనివార్యత ఏమీ లేదు. అనివార్యతలో పడ్డానని భావించినప్పుడు అధికారాన్ని వదులుకుని వెళ్లిపోతాను అని వాజ్పేయి అన్నారు. పరమహంస సంస్మరణ సభలో చెప్పిన విషయాన్ని తాను ఇది వరకు వందసార్లు చెప్పానని ఆయన గుర్తు చేశారు.
ప్రధాని వాజ్పేయిపై విపక్షాలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చాయి. లోకసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో వాజ్పేయి సభ వెలువల ప్రధానమైన ప్రకటన చేసినందుకు ఈ హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చాయి. ప్రతిపక్షాల విమర్శలకు ప్రధాని తీవ్రంగా ప్రతిస్పందించారు. తన మాటలకు విపక్షాలు తప్పుడు అర్థాలు తీస్తున్నాయని ఆయన అన్నారు. భావోద్వేగంతో మాట్లాడిన మాటలకు పెడర్థాలు తీస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. తాను ఆలయ నిర్మాణంపై మాట్లాడానే తప్ప ఆలయం ఎక్కడ నిర్మించాలనే విషయాన్ని ప్రస్తావించలేదని ఆయన స్పష్టం చేశారు. ఆలయ నిర్మాణం జరగాలనే మెజారిటీ ప్రజల మనోభావాన్ని తాను వ్యక్తం చేశానని ఆయన చెప్పారు.