ఢిల్లీకి హైదరాబాద్ ఆదర్శం: అద్వానీ
న్యూఢిల్లీ: హైదరాబాద్స్వరూపమే మారిపోయిందని, హైదరాబాద్ భారత ఆరోగ్య, ఐటి రాజధాని అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగర్వంగా చెప్పుకుంటున్నారని ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ అన్నారు. ఢిల్లీలో ఆ పరివర్తన ఎందుకు రాలేదని ఆయన అడిగారు. అటువంటి మార్పు ఢిల్లీలో రావాలని ఆయన అభిలషించారు.
భారతీయ జనతా పార్టీ (బిజెపి) పరివర్తన ర్యాలీని ఉద్దేశించి ఆయన ఆదివారం ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి గెలిస్తే మదన్లాల్ ఖురానా ముఖ్యమంత్రి అవుతారని, ఖురానా నేతృత్వంలోని ప్రభుత్వం ఢిల్లీని అభివృద్ధి పరచగలదని ఆయన చెప్పారు. ఢిల్లీ ముఖ్యమంత్రినే కాకుండా ఢిల్లీ స్వరూపాన్ని కూడా మార్చుకోవాలని ఆయన కోరారు.
దేశమంతటి నుంచి ఢిల్లీకి ప్రజలు వస్తారని, ఆ కారణంగా డిల్లీ ఒక మినీ ఇండియా అని, ఇక్కడ అందరూ సుఖంగా, సంపద్వంతంగా జీవించగలగాలని, తమకు ఇక్కడ భవిష్యత్తు ఉన్నదనే భావనకు గురి కావాలని ఆయన అన్నారు. ఢిల్లీ పరిశుభ్రత, పచ్చదనం వెల్లివిరియాలని, ఢిల్లీ ప్రజలు ఆనందంగా బతకాలని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ మాస్టర్ ప్లాన్ను రూపొందించామని ఆయన వివరించారు. ఢిల్లీకి త్వరలో రాష్ట్ర ప్రతిపత్తి కల్పిస్తామని, ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతామని అద్వానీ చెప్పారు.