రాజీనామాకు మరో 16 మంది సిద్ధం?
హైదరాబాద్: మరో 16 మంది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తమ శాసనసభ్యత్వాల రాజీనామాకు సిద్ధపడ్డారు. శనివారంనాడు ఐదుగురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేసినవిషయం తెలిసిందే. వీరు తమ రాజీనామా పత్రాలను ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకిపంపారు.
ఆదివారంనాడు మరో ఐదుగురు తమ రాజీనామా లేఖలను సోనియాకు పంపినట్లు సమాచారం. తెలంగాణపై వైఖరిని స్పష్టం చేయకుండా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి)కి కొత్త అధ్యక్షుడ్ని నియమించినందుకు వీరు నిరసన తెలియజేస్తున్నారు. తెలంగాణకు ప్రత్యేక పిసిసిని ఏర్పాటు చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. అసమ్మతి శాసనసభ్యులతో ఎఐసిసి అధికార ప్రతినిధి, మిర్యాలగుడా లోక్సభ సభ్యుడు ఎస్. జైపాల్ రెడ్డి, సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ చర్చలు జరుపుతున్నారు.
ఇదిలా వుంటే, కొత్త పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ వచ్చే వారంలో సోనియా గాంధీని కలుసుకునే అవకాశాలున్నాయి. ఒక రాష్ట్రంలో రెండు పిసిసిలు ఏర్పాటు చేయడం సాధ్యం కాదని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జి గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. తెలంగాణ అంశాన్ని తేల్చకపోతే పార్టీ కష్టాలను ఎదుర్కోవాల్సి వుంటుందని పిసిసి అధ్యక్ష పదవి నుంచి ఉద్వాసనకు గురైన ఎం. సత్యనారాయణ రావు అంటున్నారు. చాలా కాలంగా ఆయన ఈ విషయం చెబుతూ వస్తున్నారు.