ఇబిసిలకు త్వరలో రిజర్వేషన్లు: ప్రధాని
జైపూర్: ఇతర పార్టీలు అంగీకరిస్తే ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెడతామని ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి హామీ ఇచ్చారు. ఆయన ఆదివారంనాడిక్కడ భారతీయ జనతా పార్టీ (బిజెపి) పరివర్తన యాత్ర ముగింపు సభలో ప్రసంగించారు.
కార్గిల్ యుద్ధసమయంలో జరిగిన రక్షణ కొనుగోళ్లపై ప్రతిపక్షాలు పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేయడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. కలిసి పని చేయడం ద్వారా మాత్రమే సమస్యలను పరిష్కరించుకోగలమని, గొడవలు సృష్టించడం వల్ల కాదని ఆయన అన్నారు. రిజర్వేషన్ అంశం సోదరుల మధ్య అగాధం సృష్టించకూడదని ఆయన అన్నారు. వివాదాస్పదమైన రామాలయ నిర్మాణం, హిందూత్వ అంశాలను ఆయన ప్రస్తావించలేదు. ఆర్థిక వెనుకబడిన అగ్రవర్ణాలకు అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ప్రభుత్వోద్యోగాల్లో కోటాను కల్పించిన నేపథ్యంలో ప్రధాని రిజర్వేషన్ల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.