పట్టాలు తప్పిన మెట్రో రైలు
హైదరాబాద్: మల్టీ మోడల్ట్రాన్స్పోర్టు సిస్టమ్ (ఎంఎంటిసి) మెట్రో రైలు ఆదివారంనాడు పట్టాలు తప్పింది. అయితే ప్రాణనష్టమేదీ సంభవించలేదు. ఈరైలును శనివారంనాడు ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ చేతులమీదుగా అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఆరు బోగీలతో సికింద్రాబాద్ నుంచి లింగంపల్లికి ఈ మెట్రో రైలు బయలుదేరింది. బోరబండ, శేర్లింగంపల్లిల మధ్య ఈ రైలు రెండు బోగీలు పట్టాలు తప్పాయి. అతి వేగంగా నడిచే ఈ రైలుకు గేదెలు అడ్డు రావడంతో సడెన్ బ్రేక్ వేశారని, దీంతో రైలు పట్టాలు తప్పిందని అధికార వర్గాలు చెప్పాయి. ప్రమాదంలో రెండు గేదెలు మరణించాయి. స్థానిక ప్రజల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని రైల్వే అధికారులు అంటున్నారు.
ప్రమాదంపై రైల్వే శాఖ తీవ్రంగా ప్రతిస్పందించింది. రైలు పట్టాల వెంట భద్రతా ఏర్పాట్లను క్షుణ్నంగా పరిశీలించే పనిని చేపట్టింది. ప్రమాదాలను నివారించడానికి రైల్వే శాఖ సేఫ్టీ కమిటీని వేసింది. ఈ కమిటీ వారం రోజుల్లో తన నివేదికను అందజేస్తుంది. మైట్రో రైళ్లు నడవడానికి ప్రత్యేక ట్రాక్ లేకపోవడంతో సిబ్బంది మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని రైల్వే శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు.