డిఎంకే బాసట, జయలలిత ఊగిసలాట
చెన్నై: ఎన్డీఏ ప్రభుత్వానికి బాసటగా నిలవాలని డిఎంకే నిర్ణయించింది. సోమవారం జరగనున్నఅవిశ్వాస పరీక్షలో అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయనున్నామని డిఎంకె అధ్యక్షుడు ఎం.కరుణానిధి ఆదివారం తిరుచారపల్లిలోవిలేకరుల సమావేశంలో వెల్లడించారు. అయితే, జయలలిత అధ్వర్యంలోని ఏఐడిఎంకే మద్దతును కూడగట్టేందుకు ఎన్డీఏ కూటమి చేస్తోన్న ప్రయత్నాలు కరుణానిధిని ఇబ్బందిపెట్టినట్లుగా కన్పిస్తోంది.
ఏఐడిఎంకే మద్దతు ఇచ్చినా, ఇవ్వకున్నా డిఎంకే మాత్రం ఎన్డీఏకు బాసటగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. లోక్ సభకు 12 మంది డిఎంకె సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డిఎంకెసీనియర్ సభ్యుడు మురసోలి మారన్ మాత్రం ప్రస్తుతం విదేశాల్లో చికిత్స చేయించుకుంటున్నారు.
మరోవైపు,అవిశ్వాస పరీక్షలో ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలో వద్దో..ఇంకా అన్నాడిఎంకే నిర్ణయించుకోలేదు. సోమవారం నాడు చెన్నైలో జరిగే పార్టీ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకుంటారు.