నీటిపోరు: అనంతలో విధ్వంసం
అనంతపురం/కర్నూలు: అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ చేస్తున్న జల ఉద్యమం సోమవారం విధ్వంసానికి దారి తీసింది. శాసనసభ్యుల సాక్షిగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారు.
తమ జిల్లాకు తుంగభద్ర జలాలు అందించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సోమవారంనాటికి ఆరో రోజుకు చేరుకుంది. దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు తుంగభద్ర ఎగువ కాలువ కార్యాలయాన్ని దిగ్బంధం చేశారు. ఆ తర్వాత కార్యాలయంపై దాడి చేశారు. అద్దాలు పగులగొట్టారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. శ్రీకంఠం సర్కిల్ వద్ద బస్సులను ధ్వంసం చేశారు. ఏడవ జాతీయ రహదారిపై బైఠాయించి ట్రాఫిక్ను అడ్డుకున్నారు. ఈ విధ్వంసం ముగ్గురు కాంగ్రెస్ శాసనసభ్యులు చూస్తుండగానే జరిగింది.
ఇదిలా వుంటే, కృష్ణా జలాల కోసం కర్నూలు రైతులు చేపట్టిన ఆందోళన ఉధృత రూపం దాలుస్తోంది. రైతు నాయకులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు ఆరో రోజుకు చేరుకున్నాయి. దీక్ష చేస్తున్న నాయకులకు మద్దతుగా రైతులు 8వ నెంబరు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. తాము తాగునీరు, ఆరుతడి పంటలకు కొద్ది సాగునీరు అడుగుతుంటే ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం శోచనీయమని రైతు నాయకులు అన్నారు. శ్రీశైలం రిజర్వాయర్ నీటిని విద్యుదుత్పత్తికి వాడుతుండడాన్ని వారు నిరసించారు.