బాబు రాజీనామాకు విపక్షాల పట్టు
హైదరాబాద్: రాష్ట్రంలో వెల్లువెత్తుతున్న కుంభకోణాలకు నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. రాజకీయ, నేర ప్రపంచాల మధ్య సంబంధాలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి. రాష్ట్ర మంత్రివర్గమే నేరస్థులతో నిండిపోయిందని వ్యాఖ్యానించాయి.
నకిలీ స్టాంపు పత్రాల కుంభకోణంలో తెలుగుదేశంపార్టీ శాసనసభ్యుడు సి. కృష్ణా యాదవ్ పాత్ర మంగళవారం శాసనసభను కుదిపేసింది. దేశంలోనే అతి పెద్దదైన స్టాంపుల కుంభకోణంపై కావాలని ప్రభుత్వం దర్యాప్తును ముందుకు సాగనీయడం లేదని కాంగ్రెస్ విమర్శించింది. నేరమయ రాజకీయాలపై చర్చను మంగళవారం శాసనసభలో కాంగ్రెస్ సభ్యుడు కె.ఆర్. సురేష్ రెడ్డి ప్రారంభించారు. నేరశక్తులు ప్రభుత్వంలోకి చొచ్చుకుపోయాయని కృష్ణా యాదవ్ అరెస్టు నిరూపిస్తోందని, స్టాంపుల కుంభకోణంలో అధికార పార్టీ పెద్దలకు పలువురికి పాత్ర ఉన్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు. ఈ సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం దూషణలకు దిగారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. పరస్పర నేర చరిత్రలను తవ్వుకుంటూ రాజకీయ నీతి గురించి పరస్పరం విమర్శలు గుప్పించుకున్నాయి.
జంట హత్య కేసులో నిందితుడైన గృహ నిర్మాణ శాఖ మంత్రి రామసుబ్బారెడ్డి మంత్రి వర్గంలో కొనసాగించడాన్ని తప్పు పడుతూ హైకోర్టు వ్యాఖ్యలు చేసిందని, అయినప్పటికీ ఆయనను మంత్రి పదవిలో కొనసాగిస్తున్నారని అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. రామసుబ్బారెడ్డిని మంత్రిపదవిలో కొనసాగించడాన్ని బట్టి రాజకీయాలు ఎంతగా పతనమయ్యాయో అర్థం చేసుకోవచ్చునని సురేష్ రెడ్డి వ్యాఖ్యానించారు.