ఉత్తరాంధ్రలో వరదలు- 8మంది మృతి
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర అతలాకుతలమైంది. మూడు జిల్లాలపై వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. వరదలకు ఎనమండుగురు మరణించారు. వరద ఉధృతి ఉత్తరాంధ్రలో ఇంకా తగ్గుముఖం పట్టలేదు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పంటలు నాశనమయ్యాయి. పలు ప్రాంతాలు జలమయ్యాయి.శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి నదులు పొంగిపొర్లుతున్నాయి.విజయనగరం జిల్లాలోని సువర్ణముఖి నది ఉపనది ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తోంది. దీంతో దాదాపు 60 చెరువులకు గండ్లు పడ్డాయి. లక్షా 20 వేల క్యూసెక్కుల నీరు ఉపనది నుంచి సువర్ణముఖిలో చేరుతోంది.విశాఖపట్నం జిల్లాలో కొండ చరియలు విరిగిపడ్డాయి.
సహాయ చర్యల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాన్ని పంపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఐఎఎస్ అధికారులు రమాకాంతరెడ్డి, కృష్ణయ్య ఉత్తరాంధ్రకు చేరుకుంటున్నారు.వీరు దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు.