ప్రాణత్యాగానికి సిద్ధం: బాబు
హైదరాబాద్: ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలవిషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఆయన గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని తన నివాసం నుంచి డయల్ యువర్ ప్రెసిడెంట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా తనపై జరిగిన దాడి, నక్సలైట్ సమస్య ప్రధానంగా చర్చకు వచ్చింది.
తాను ఎక్కడా రాజీ పడబోనని, ధైర్యంగా ముందుకు సాగుతానని ఆయన చెప్పారు. ధైర్యంగా ముందుకు సాగాలని ఆయన తన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.సెక్యురిటీ బాగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలని ఒక వ్యక్తి చేసిన సూచనకు ఆయన ప్రతిస్పందిస్తూ కార్యకర్తలు, ప్రజలు తనను సమీపించాలని చూస్తారని, అటువంటి సందర్భంలోసెక్యురిటీ వల్ల తాను ప్రజలకు దూరమవుతున్నానేమోననే సందేహం వేధిస్తూ వస్తోందని అన్నారు. కేవలంసెక్యురిటీ రక్షించలేదని, ప్రజాభిమానం, దైవానుగ్రహం మాత్రమే ప్రాణాలు కాపాడుతుందని ఆయన అన్నారు.
నక్సలైట్ల పట్ల ప్రజల వ్యతిరేకత పెరుగుతోందని, వారు కూడా ఈవిషయాన్ని గమనించాలని, జనజీవన స్రవంతిలోకి రావాలని ఆయన అన్నారు. తాము చాలా మంది నాయకులను, కార్యకర్తలను కోల్పోయామని, తెలుగుదేశం సిద్ధాంతాలను ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నించడం వల్లనే వారిని పొట్టనపెట్టుకున్నారని ఆయన అన్నారు. త్యాగాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఏదో కారణం వల్ల నక్సలైట్లలోకి వెళ్తున్నవారి చేత తప్పులు చేయిస్తూ తిరిగి వెనక్కి రాలేని పరిస్థితి కల్పిస్తున్నారని ఆయనవిమర్శించారు. ఈ విషయంలో ప్రజలను చైతన్యవంతులను చేయాలని ఆయనకోరారు.
ఇంకా నొప్పులున్నాయని, శరీరమంతా నొప్పి పెడుతోందని, ప్రజల అభిమానం వల్ల ఆ బాధలు మరిచిపోతున్నానని ఆయన అన్నారు. ప్రజల అభిమానమే తనకు పునర్జన్మ ఇచ్చిందని ఆయన చెప్పారు. ఇలా టీవీ ద్వారామీతో ముఖాముఖి మాట్లాడడం వల్ల నొప్పి తీవ్రమవుతుందని వైద్యులు చెప్పారని,మీ సహకారం, మీ అభిమానం కోసం, ఆశీస్సుల కోసం ఇది అవసరమనిపించిందని ఆయన అన్నారు.