పబ్లిక్ గా విమర్శలొద్దు: డీఎస్ సూచన
హైదరాబాద్: ఏవైనా విభేదాలు ఉంటే వాటిని పబ్లిక్ గా బయటపెట్టొద్దని, బహిరంగవిమర్శలు మానుకోవాలని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కాంగ్రెస్ నేతలకు సూచించారు. విభేదాలు, అసంతృప్తులు ఏమైనా ఉంటే పార్టీలోసీనియర్ నేతలకుగానీ పీసీసీకి గానీ తెలియచేయాలి.
కానీ వాటిని బయటపెట్టి పార్టీ పరువును తీయకండని డిఎస్ హైదరాబాద్, ఆదిలాబాద్ కాంగ్రెస్ నాయకులకు తెలియచేశారు. ఆయన ఈ జిల్లాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో శనివారం గాంధీభవన్ లో సమావేశమయ్యారు.
పార్టీ కార్యకర్తలు తలో ఒకరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని, ఇక ముందు ఇలా ఇష్టమొచ్చినట్లు వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు మాత్రమే ఉచితవిద్యుత్ కు తమ పార్టీ కట్టుబడి ఉందని, ఎవరైనా దీనికి వ్యతిరేకంగా అభిప్రాయం వ్యక్తం చేసినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయంగానే పరిగణించాలని ఆయన అన్నారు.