అలిపిరి లోపం ఎక్విప్మెంట్దేనా?
హైదరాబాద్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భద్రతనుపెంచనున్నారు. దీంతో పాటు మరిన్ని బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను, మందుపాతరలను కనిపెట్టే పరికరాలను సమీకరించుకోనున్నారు. ఈవిషయాన్ని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ ఎస్.ఆర్. సుకుమార మంగళవారంవిలేకరుల సమావేశంలో తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై దాడి కేసులో కొన్ని ఆధారాలు దొరికాయని సుకుమార చెప్పారు. అయితే దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించలేదని,అందువల్ల వారి పేర్లు వెల్లడించలేమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిపై దాడి ఎవరు జరపారనేది నిర్ధారించడానికి ఇంకా ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబును లక్ష్యంగాపెట్టుకుని పీపుల్స్వార్ మందుపాతర పేల్చిన తర్వాత వెల్లడైన భద్రతా లోపాలను సరిదిద్దే ప్రయత్నంలో ఉన్నామని ఆయన చెప్పారు. తమ వద్ద ఇప్పుడు ఉన్న మందుపాతరలను గుర్తించే పరికరం మరీ లోతుగాపెట్టిన మందుపాతరలను గుర్తించలేదని,అందువల్ల ఆత్యాధునాతన పరికరాలను సమీకరించుకుంటున్నామని ఆయన చెప్పారు. తిరుమలలో ముఖ్యమంత్రి పయనించే దారిని ఈ నెల 1వ తేదీన బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ తనిఖీ చేసిందని, తమ వద్ద ఉన్న పరికరం నక్సల్స్పెట్టిన మందుపాతరను గుర్తించలేకపోయిందని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ భద్రత కల్పిస్తారా అనివిలేకరులు అడిగితే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమని, ప్రస్తుత భద్రత కొనసాగుతుందని ఆయన సమాధానమిచ్చారు.