పోలీసులకు బాబు చురకలు
తిరుపతి: శాంతి భద్రతలపై తాను చేసిన హెచ్చరికలను పోలీసులు బేఖాతరు చేయడం వల్లనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ సంరక్షణ అధికారుల నిర్లక్ష్యం వల్ల నక్సల్స్ దాడి చేయడానికి అవకాశం చిక్కిందని ఆయన అన్నారు.
తనపై నక్సల్స్ దాడి తర్వాత తిరుమల చేరుకున్న ముఖ్యమంత్రి దాదాపు 16 గంటల పాటుస్వామివారి సన్నిధిలో గడిపారు. గర్భగుడిలో పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో కలియతిరిగారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య మొక్కులు తీర్చుకున్నారు. పుణ్యక్షేత్రాలను నక్సల్స్ విధ్వంసకర చర్యలకు వాడుకోవడంవిచారకరమని ఆయన అన్నారు.
తనపై నక్సల్స్ దాడి చేసిన అలిపిరి ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. దాదాపుఅరగంట సేపు అక్కడ కలియతిరిగారు. అక్కడ చెట్లు నరికి వుండడాన్ని ఆయన గమనించారు. చెట్లు గానీ, కలప గానీ అక్కడి నుంచి కదలకూడదని, వనసంపద నేచురల్ఫెన్సింగ్లా తయారు కావాలనేది తన ఉద్దేశమని ఆయన అన్నారు. నక్సల్స్ తనపై దాడి చేయడానికి మాటు వేశారని భావిస్తున్న స్థలాన్ని చూశారు. అయన ముందు క్లైమోర్ శకలాలు కొన్ని అక్కడ బయట పడ్డాయి. వాటిని చూసిన ముఖ్యమంత్రి పోలీసులకు చురకలుఅంటించారు. అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.