విజయభేరికి ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్/ కరీంనగర్: నక్సలైట్ల వల్లనే రాష్ట్రం అభివృద్ధి చెందడం లేదని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయాధ్యక్షుడుఎం. వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. కరీంనగర్లో ఆదివారం తలపెట్టిన పార్టీ ప్రాంతీయ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ఆయనవిలేకరులతో మాట్లాడారు.
నక్సలైట్లు ఎన్ని అడ్డంకులు కల్పించినా తమ పార్టీ నాయకులు మారుమూల ప్రాంతాలకు వెళ్లి ప్రచారం సాగిస్తారని ఆయన అన్నారు. అడవుల్లో ఉండి నక్సలైట్లు సాధించేది ఏమీ లేదని, జనజీవన స్రవంతిలో కలిసిపోవడం మంచిదని ఆయన అన్నారు. తెలుగుదేశం, బిజెపి నాయకులనే నక్సలైట్లు చంపుతున్నారని, దీనిపై కాంగ్రెస్, వామపక్షాలు నోరు మెదపడం లేదని, దీన్ని బట్టి వారి సానుభూతి ఎటు వైపు ఉన్నదోఅర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. ప్రజలు హింసను వ్యతిరేకిస్తున్నారని, అభివృద్ధిని కోరుకుంటున్నారని, ప్రజల్లో నెలకొన్న భయాన్ని తొలగించాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. హత్య వల్ల సమస్యలు పరిష్కారం కావని ఆయన అన్నారు. నక్సలైట్లు జన జీవన స్రవంతిలోకి వచ్చి తాము కోరుకున్నవారిని ఎన్నికల్లో గెలిపించుకోవచ్చునని, లేదంటే పోటీ చేసి వారే గెలుపొందవచ్చునని ఆయన అన్నారు.
పదే పదే మాట్లాడడం ద్వారా నక్సలైట్లు అనవసరమైన గుర్తింపును ఇస్తున్నారని కేంద్రమంత్రి, బిజెపి నాయకుడు చెన్నమనేని విద్యాసాగరరావు ఆదివారం కరీంనగర్లోవిలేకరులతో అన్నారు. నక్సలైట్లకు కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) వత్తాసు పలుకుతున్నాయని ఆయనవిమర్శించారు.