రిలయెన్స్ వ్యతిరేక ఆందోళన ముమ్మరం
టిఆర్ఎస్ తన పట్టు వీడకపోవడంతో చర్చలు కొలిక్కి రాలేదని తెలుస్తోంది. తమకు 51 శాసనసభ సీట్లు, ఏడు లోక్సభ సీట్లు ఇవ్వాలని పట్టుబట్టిన టిఆర్ఎస్ 42 అసెంబ్లీ స్థానాలకు, 5 లోక్సభ స్థానాలకు అంగీకరించడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. అయితే తాము 35 అసెంబ్లీ స్థానాలు, 4 లోక్సభ స్థానాలు కేటాయిస్తామని చెప్పినట్లు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చెబుతున్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్తో పొత్తు ఉండాలనేదే తమ ఉద్దేశమని ఆయన అన్నారు. తెలుగుదేశం ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఇతర ప్రతిపక్షాలతో పొత్తులు సాధించే బాధ్యత ప్రధాన ప్రతిపక్షమైన తమ మీద ఉన్నదని, అయితే ఇతర పక్షాలు కూడా బాధ్యతాయుత విధానాన్ని అనుసరించడం అవసరమని ఆయన అన్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్తో తమ చర్చలు ఒక కొలిక్కి రాలేదని, సీట్ల పంపకంపై చర్చించలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అంటున్నారు. ఆయన కూడా ఢిల్లీ వెళ్లి తిరిగి వచ్చారు. ఢిల్లీలో రాజకీయ విధానాలపైనే చర్చించామని ఆయన చెప్పారు. సీట్ల పంపకంపై రాష్ట్రంలో చర్చలు జరుగుతాయని ఆయన అంటున్నారు. పొత్తుల వ్యవహారమంతా తమ అధిష్ఠానమే చూసుకుంటుందని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పి) మాజీ నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అంటున్నారు. పొత్తుల గురించి ఏ విషయం అడిగినా ఆయన అదే సమాధానం ఇస్తున్నారు.