రిలయెన్స్ వ్యతిరేక ఆందోళన ముమ్మరం
మెల్బోర్న్: విబి వన్డే సిరీస్ ఆస్ట్రేలియా వశమైంది. రెండో ఫైనల్ మ్యాచ్లో భారత్ ఘోరంగా పరాజయం పాలైంది. వరుసగా రెండు ఫైనల్ మ్యాచ్ల్లోనూ భారత్ ఓడిపోవడంతో విబి సిరీస్ ఆస్ట్రేలియా చేజిక్కించుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి నిర్ణీత 50 ఓవర్లలో 359 పరుగులు చేసింది. భారత బౌలర్లను ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ చితికబాదారు. ఇర్ఫాన్ పఠాన్ రెండు వికెట్లు, నెహ్రా రెండు వికెట్లు తీసుకున్నారు. అయితే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ పరుగుల వరదకు బ్రేక్ వేయడంలో భారత బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. హెడెన్ సెంచరీ చేశాడు. హెడెన్ 126 పరుగులు చేయగా సైమండ్స్ 66 పరుగులు, మార్టిన్ 67 పరుగులు చేశారు.
ఆస్ట్రేలియా ఉంచిన లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారత ఓపెనర్లు ధాటిగా ప్రారంభించినప్పటికీ సెహ్వాగ్ 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు. అప్పటి నుంచి భారత వికెట్లు క్రమం తప్పకుండా కూలిపోతూ వచ్చాయి. సచిన్ టెండూల్కర్ 27 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆస్ట్రేలియాకు సింహస్వప్పంగా మారిన హైదరాబాద్ బ్యాట్స్మన్ వివియస్ లక్ష్మణ్ రెండు ఫైనల్ మ్యాచ్ల్లోనూ చేతులెత్తేశాడు. ఆదివారంనాటి మ్యాచ్లో ఐదు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ దారి పట్టాడు. పఠాన్ 30 పరుగులు చేశాడు. భారత్ 33.2 ఓవర్లలో 151 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది.