పెట్రోలు, గ్యాస్ వడ్డింపు వాయిదా
న్యూఢిల్లీ: పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఇప్పట్లో పెరిగే అవకాశాలు లేవు. పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ల ధరలు పెంచాలని ప్రభుత్వరంగంలోని చమురు సంస్థలు కోరుతున్నప్పటికీ కొత్త ప్రభుత్వం ఏర్పడకముందే ధరలు పెంచితే ప్రజల్లో అసంతృప్తి బీజాలు పడతాయన్న కారణంగా వాయిదావేసే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పెరుగుదల, దేశీయ ఇంధనం ధరల విధానాన్ని అధ్యయనం చేసిన తర్వాత ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ఎన్నికల కారణంగా ఎన్డీఎ ప్రభుత్వం గత ఆరు నెలలుగా పెట్రో ఉత్పత్తుల ధరలను నిలకడగా ఉండచం, అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు గణనీయంగా పెరగడంవల్ల చమురు సంస్థలు ధరల వడ్డింపునకు ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరలపై లీటరుకు నాలుగు రూపాయలదాకా పెంచాలని చమురు సంస్థలు కోరుతున్నట్లు సమాచారం.