రికార్డు మిస్సైన సచిన్: భారత్ భారీ స్కోర్
మొహాలీ: భారత బ్యాట్స్మన్ సచిన్ టెండూల్కర్ను దురదృష్టం వెన్నాడింది. టెస్టు మ్యాచ్ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డును బద్దలు కొడతాడని భావించిన సచిన్ గురువారం మొహాలీ టెస్టులో ఆరు పరుగులతో సెంచరీ మిస్సయ్యాడు. ఇప్పటి వరకు అత్యధికంగా 34 సెంచరీలతో సునీల్ గవాస్కర్ రికార్డును సమం చేసిన టెండూల్కర్ ఈ మ్యాచ్లో ఆ మైలురాయిని దాటగలడనే ఆశలు నిరాశనే మిగిల్చాయి. సచిన్ 94 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుటయ్యాడు. కొత్త బంతికి సచిన్ వికెట్ బలైంది. అలాగే ఒక్క పరుగుతో వీరేంద్ర సెహ్వాగ్ మొహాలీ మైదానంలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించే అవకాశాన్ని కోల్పోయాడు. వీరేంద్ర సెహ్వాగ్ 173 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుటయ్యాడు. ఇప్పటి వరకు ఈ మైదానంలో చేసిన వ్యక్తిగత అత్యధిక స్కోర్ 174 పరుగులు.
సెహ్వాగ్ అవుటైన తర్వాత భారత్ రన్ రేట్ క్రమంగా తగ్గుతూ వచ్చింది. పాకిస్థాన్ స్పిన్నర్ కనేరియా బౌలింగ్లో పరుగులు తీయడం భారత బ్యాట్స్మెన్కు కష్టమే అయింది. అయితే భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. గురువారం ఆట ముగిసే సమయానికి భారత్ ఆరు వికెట్ల నష్టానికి 447 పరుగులు చేసింది. పాకిస్థాన్ మొదటి ఇన్నింగ్స్ స్కోర్పై 135 పరుగులు ఆధిక్యాన్ని సాధించింది. రాహుల్ ద్రావిడ్ 50 పరుగులు చేసి అవుటయ్యాడు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన కెప్టెన్ గంగూలీ పెద్దగా పరుగులేమీ చేయకుండానే అవుటయ్యాడు. 21 పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద గంగూలీ పెవిలియన్ దారి పట్టాడు. సమీ, కనేరియా రెండేసి వికెట్లు తీసుకోగా, హసన్, రజాక్ ఒక్కటేసి వికెట్లు తీసుకున్నారు. కొంత బంతితో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్లు ఫలితాలు సాధించారు.