చిత్తూరు అర్బన్ బ్యాంక్పై అసెంబ్లీలో రభస
హైదరాబాద్: చిత్తూర సహకార అర్బన్ బ్యాంక్ సంక్షోభం శుక్రవారం శాసనసభను కుదిపేసింది. బ్యాంక్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం శాసనసభ్యురాలు లలితకుమారి ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఆ బ్యాంక్ సంక్షోభానికి గతంలో జరిగిన ఘటనలే కారణమని, అందువల్ల తానెలా సమాధానం చెప్తానని సహకార మంత్రి కన్నా లక్ష్మినారాయణ అనడంతో అల్లరి మొదలైంది. తెలుగుదేశం సభ్యులు మంత్రి వ్యాఖ్యకు తీవ్ర అభ్యంతరం తెలియజేస్తూ స్పీకర్ కె. ఆర్. సురేష్ రెడ్డి పోడియాన్ని చుట్టుముట్టారు.
చిత్తూరు అర్బన్ బ్యాంక్కు చెందిన 27 కోట్ల రూపాయలను మూతపడిన అర్బన్ బ్యాంక్ల్లో డిపాజిట్ చేశారని, చిత్తూరు అర్బన్ బ్యాంక్ పాలకమండలి అక్రమాలకు పాల్పడిందని, దాని వల్ల చిత్తూరు అర్బన్ బ్యాంక్ సంక్షోభంలో చిక్కుకందని ఈ ఘటన తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిందని మంత్రి లక్ష్మీనారాయణ అంటూ ఈ విషయాన్ని మీ నాయకులను అడగండని అని తెలుగుదేశం సభ్యురాలు లలితకుమారితో అన్నారు. దీనికి తెలుగుదేశం సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఏ రాజకీయ అండదండలతో చిత్తూరు అర్బన్ బ్యాంక్ డబ్బులను మూతపడిన బ్యాంక్ల్లో డిపాజిట్ చేశారని మంత్రి అడిగారు. ఈ సమయంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు జోక్యం చేసుకొని బకాయిల వసూళ్లకు అవసరమైతే ఓ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. సమస్యను దారి మళ్లించి రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని, అవసరమైతే దోషులకు శిక్ష పడేలా చేయడానికి తమ వంతు సహకారం అందిస్తామని ఆయన అన్నారు.