విజయానికి చేరువగా భారత్: పాక్ ప్రతిఘటన
మొహాలీ: తొలి క్రికెట్ టెస్టు మ్యాచ్లో భారత్ విజయాన్ని శాయశక్తులా అడ్డుకోవడానికి పాకిస్థాన్ బ్యాట్స్మెన్ ప్రయత్నిస్తున్నారు. మొదట పాకిస్థాన్ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్, యోహానాలు, ఆ తర్వాత అబ్దుల్ రజాక్ భారత బౌలింగ్ను ప్రతిఘటించే పనికి పూనుకున్నారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ మూడు వికెట్లను అతి త్వరగా కోల్పోయి భారత్కు విజయం సునాయసంగా అందుతుందనే అభిప్రాయం కలిగింది. అయితే తర్వాత పాక్ ప్రతిఘటన తీవ్రతరమైంది. శుక్రవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ తన రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్పై 53 పరుగుల ఆధిక్యతను సంపాదించింది.
అంతకు ముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 516 పరుగులకు ఆలవుటయింది. శుక్రవారం ఉదయం భారత్ వికెట్లను త్వరత్వరగా కోల్పోయింది. వివియస్ లక్ష్మణ్ 58 పరుగులకు అవుటయ్యాడు. బాలాజీ కొన్ని అందమైన మెరుపు షాట్లతో ప్రేక్షకులను అలరించాడు. కనేరియా వేసిన ఒక ఓవర్లో 14 పరుగులు తీసి భేష్ అనిపించుకున్నాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ తొలి మూడు వికెట్లను పది పరుగులకే కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్లో ఐదు పాకిస్థాన్ వికెట్లు తీసిన బాలాజీ రెండో ఇన్నింగ్స్లోనూ తానే మేటి అనిపించుకున్నాడు. మూడు పాకిస్థాన్ వికెట్లు తీసుకున్నాడు. కుంబ్లే రెండు, పఠాన్ ఒకటి తీసుకున్నారు. ఇంజమామ్ ఉల్ హక్ మరోసారి నిలకడైన ఆటతీరు ప్రదర్శించాడు. యోహానా, ఇంజమామ్ల జోడీ భారత బౌలర్లకు సవాల్గా నిలిచింది. ఈ రెండు వికెట్లను కుంబ్లే తీసుకుని తన సత్తా మరోసారి చాటుకున్నాడు. ఇంజమామ్ 86 పరుగులు చేయగా, యోహానా 61 పరుగులు చేశాడు. అసిమ్ కమాల్ 48 పరుగుల వద్ద బాలాజీ బౌలింగ్లో అవుటయ్యాడు. శుక్రవారం ఆట ముగిసే సమయానికి అబ్దుల్ రజాక్ 22 పరుగులతోనూ, అక్మల్ 9 పరుగులతోనూ క్రీజ్లో ఉన్నారు. శనివారం చివరి రోజు మిగతా వికెట్ల ఉదయం పూట త్వరత్వరగా తీస్తే తప్ప భారత్కు విజయం సునాయసంగా అందదు.