టిడిపి సభ్యులందరం వైదొలుగుతాం: దేవేందర్
హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల టెండర్ల ఖరారులో అవినీతిని రుజువు చేయలేకపోతే తెలుగుదేశం సభ్యులందరూ తప్పుకుంటారని తెలుగుదేశం శాసనసభా పక్షం ఉపనాయకుడు టి. దేవేందర్ గౌడ్ ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. ఈ వ్యవహారంపై న్యాయవిచారణకు ఆదేశించాలని, తాము అవినీతిని రుజువు చేసి తీరుతామని, చేయలేకపోతే తమ పార్టీ శాసనసభ్యులందరూ రాజీనామాలు చేస్తారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రత్యూష మృతి కేసులో తన కుమారులపై చేసిన ఆరోపణలకు శుక్రవారం శాసనసభలో దేవేందర్ గౌడ్ తీవ్రంగా ప్రతిస్పందించారు.
సాగునీటి టెండర్ల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఆర్థిక మంత్రి కె. రోశయ్య గుర్తు చేస్తూ విచారణకు ఆదేశించడం ద్వారా ప్రాజెక్టు పనులను ఆపేయాలనేది తెలుగుదేశం ఉద్దేశమా అని అడిగారు. టెండర్ల ఖరారులో వేయి కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతోందని, ఈ విషయాన్ని తాము రుజువు చేస్తామని దేవేందర్ గౌడ్ అన్నారు. అందుకు రోశయ్య అంగీకరించలేదు. కనీసం ఫైళ్లను స్పీకర్ సమక్షంలో అఖిల పక్ష నాయకుల ముందు పరిశీలనకు ఉంచాలని దేవేందర్ గౌడ్ సూచించారు. దీనికి రోశయ్య సమాధానం చెప్పలేదు.
సినీనటి ప్రత్యూష మృతి కేసులో తన కుమారుల పాత్ర ఉన్నట్లు రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని దేవేందర్ గౌడ్ అన్నారు. ప్రత్యూష మృతి వ్యవహారంలో దేవేందర్ గౌడ్ కుమారుల పాత్ర ఉన్నదని వార్తలు వచ్చాయని రాజశేఖర్ రెడ్డి అన్నారు. దీనికి దేవేందర్ గౌడ్ తీవ్రంగా ప్రతిస్పందిస్తూ ప్రత్యూష మృతి చెందిన సమయంలో తన కుమారులు హైదరాబాద్లో ఉన్నట్లు రుజువు చేసినా తాను రాజకీయాల నుంచి తప్పుకంటానని ఆయన అన్నారు. అమెరికాలో చదువుకుంటున్న తన కుమారులను ఎవరో లాగితే దాన్ని ఎత్తి చూపడమేనా అని ఆయన అడిగారు. ప్రత్యూష మృతి కేసులో హైకోర్టు తీర్పు వెలువడిందని, తాము సిబిఐ దర్యాప్తునకు కూడా ఆదేశించామని, ఇవన్నీ పట్టించుకోకుండా మాట్లాడటం సరి కాదని ఆయన అన్నారు.