బలపరీక్ష లేకుండానే 15వ తేదీకి అసెంబ్లీ వాయిదా
రాంచీ: ముఖ్యమంత్రి శిబూ సోరేన్ ప్రభుత్వ బలపరీక్ష కోసం సమావేశమైన జార్ఖండ్ అసెంబ్లీ సమావేశాలు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. తాజాగా తిరిగి రెండు గంటలకు శాసనసభ సమావేశమవుతుంది. శుక్రవారం ఉదయం సభ సమావేశమైన తర్వాత గొడవలతో ఐదు సార్లు వాయిదా పడింది. శిబూ సోరేన్ ప్రభుత్వ బలనిరూపణ పరీక్ష జరగకుండానే జార్ఖండ్ శాసనసభా సమావేశం మంగళవారానికి వాయిదా పడింది.
శుక్రవారంనాడు ఫార్వర్డ్ బ్లాక్కు చెందిన ఇద్దరు శాసనసభ్యులు అపర్ణాసేన్, భాను ప్రతాప్లు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం బలపరీక్ష నిర్వహిస్తే సభలో సభ్యులు సంఖ్య 80 మాత్రమే. మొత్తం సభ సంఖ్యాబలం 81. తమకు 41 మంది సభ్యుల బలం ఉందని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (యన్డిఎ) అంటోంది. రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ ముందు యన్డిఎ బలప్రదర్శన చేసింది. ఈ స్థితిలో ప్రోటెం స్పీకర్కు బలపరీక్ష నిర్వహించే అధికారం లేదని ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) వాదిస్తోంది. ఈ వాదనను బట్టి శిబూ సోరేన్ గెలుపు అసాధ్యమనే అనిపిస్తోంది.
శాసనసభ సమావేశాలను ప్రోటెం స్పీకర్ మంగళవారానికి వాయిదా వేయడంతో నిరసన వ్యక్తం చేస్తూ జాతీయ ప్రజాస్వామ్య కూటమి (యన్డి ఎ) శాసనసభ్యులు ధర్నాకు దిగారు.
జార్ఖండ్ వ్యవహారంలో జోక్యం చేసుకోబోమని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో స్పష్టం చేసింది. రాష్ట్రపతి జోక్యాన్ని కూడా కోరబోమని మంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం స్పష్టం చేశారు.