వైయస్ సవాల్కు నేను సిద్ధమే: నాగం
హైదరాబాద్: రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డియస్)పై మినీ జల విద్యుత్ ప్రాజెక్టుపై తాను చేసిన ఆరోపణలపై న్యాయ విచారణకు ఆదేశించాలని తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ ఉప నాయకుడు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాను చేసిన ఆరోపణలను రుజువు చేయలేకపోతే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి సిద్ధమేనని ఆయన ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి ప్రతి సవాల్ విసిరారు. తాను న్యాయవిచారణ వేయమంటే వేస్తానని, తనపై ఆరోపణలు రుజువు చేయలేకపోతే నాగం జనార్దన్ రెడ్డి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి అంతకు ముందు సవాల్ చేశారు. ఈ సవాల్ను జనార్దన్ రెడ్డి స్వీకరించారు.
మినీ విద్యుత్ ప్రాజెక్టు పనులను వెంటనే ఆపించాలని నాగం జనార్దన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి తోడల్లుడు సుబ్బారెడ్డి పెట్టిన ఆరు కోట్ల రూపాయలను తాము జోలె పట్టి సేకరించి ఇస్తామని, ప్రాజెక్టు పనులు మాత్రం ఆపాలని ఆయన అన్నారు. చర్చను ముగించాల్సిందిగా జనార్దన్ రెడ్డిని స్పీకర్ కె. ఆర్. సురేష్ రెడ్డి పదే పదే ఆదేశించారు. అయితే ఆయన వినకుండా మినీ విద్యుత్ ప్రాజెక్టు వల్ల మహబూబ్నగర్ జిల్లా రైతులకు నష్టం జరుగుతుందని చెబుతూ పోయారు. విద్యుత్ ప్రాజెక్టును ఆపించడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా కర్ణాటకపై ఒత్తిడి తేవాలని ఆయన కోరారు.
ఆర్డీయస్ మీది చర్చను ఎవరు దారి మళ్లించారో రికార్డులు పరిశీలించి రూలింగ్ ఇవ్వాలని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు స్పీకర్ను కోరారు. అందుక స్పీకర్ సమ్మతించారు. ఆర్డీయస్ మీద నిర్మిస్తున్న విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంపై సాంకేతిక కమిటీ తమకు ఆమోదయోగ్యం కాదని, ఆ ప్రాజెక్టు పనులు ఆపించాలని, అందుకు కేంద్రంపై ఒత్తిడి తేవడానికి తాము సహకరిస్తామని ఆయన అన్నారు. చంద్రబాబు మాట్లాడుతున్నంత సేపూ మధ్య మధ్యలో స్పీకర్ కె. ఆర్. సురేష్ రెడ్డి కలగచేసుకుంటూ చర్చను ముగిద్దామని, ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసిందని, అది సమ్మతం కాకపోతే నిరసన ఏ రూపంలో తెలియజేస్తారో తెలియజేయాలని అంటూ వచ్చారు. ఇలా అన్నప్పునడు ఒకసారి చంద్రబాబు తీవ్రంగా స్పందిస్తూ తమను నిరసన తెలియజేసి సభ నుంచి వెళ్లిపొమ్మంటారా అని అడిగారు.