చంద్రబాబు సహా 40 మంది టిడిపి నేతల అరెస్టు
హైదరాబాద్: ఎన్టీ ఆర్ ఘాట్ నుంచి శంషాబాద్ వరకు తెలుగుదేశం పార్టీ తలపెట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. తెలుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడితో సహా దాదాపు 40 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని గోషామహల్ స్టేడియానికి తరలించారు. తమ నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ధర్నా చేశారు. చంద్రబాబుతో సహా తెలుగుదేశం నాయకులను పోలీసులు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో విడుదల చేశారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) చైర్పర్సన్ సోనియా గాంధీ శంకుస్థాపన చేస్తుండడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఈ ర్యాలీని తలపెట్టింది. ఎన్టీ ఆర్కు శ్రద్ధాంజలి ఘటించి తెలుగుదేశం నాయకులు ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ ప్రారంభమైన వెంటనే పోలీసులు దాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఎన్టీ ఆర్ అమర్ రహే అంటూ తెలుగుదేశం నాయకులు నినాదాలు చేశారు. వైయస్ సర్కార్కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. శంషాబాద్ విమానాశ్రయానికి సోనియా గాంధీ శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని అడ్డుకుంటామని అంతకు ముందు తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.