వచ్చే నెల 17వ తేదీ ఢిల్లీ వన్డేకు ముషార్రఫ్
న్యూఢిల్లీ: భారత్ - పాక్ల మధ్య ఢిల్లీలో వచ్చే నెల 17వ తేదీన జరిగే వన్డే క్రికెట్ మ్యాచ్ చూడడానికి పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ వస్తున్నారు. ఏప్రిల్ 17వ తేదీన జరిగే వన్డే మ్యాచ్ చూడడానికి ముషార్రఫ్ వస్తున్నారని ప్రధాని మీడియా సలహాదారు సంజయ్ బారు బుధవారంనాడు చెప్పారు. ముషార్రఫ్ 16వ తేదీ రాత్రి గానీ, 17వ తేదీ రాత్రి గానీ ఢిల్లీలో బస చేస్తారని ఆయన చెప్పారు.
తన పర్యటన సందర్భంగా ముషార్రఫ్ భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ను కలుస్తారని ఆయన చెప్పారు. అయితే ఇరువురు నేతల మధ్య చర్చలకు ఎజెండా ఏమీ లేదని తెలుస్తోంది. మ్యాచ్ను చూడడానికి వెళ్లినప్పుడు భారత నాయకులతో మరింత నిర్దిష్ట చర్చల కోసం ఎదిరిచూస్తున్నట్లు ముషార్రఫ్ బిబిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మ్యాచ్ చూడడం కన్నా భారత నాయకులను కలుసుకోవడం తనకు ప్రధానమని ఆయన చెప్పారు.