ప్లకార్డుల ప్రదర్శనపై అసెంబ్లీలో వాగ్వివాదం
హైదరాబాద్: శాసనసభలో బ్యానర్లు, ప్లకార్డుల ప్రదర్శనపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యుల మధ్య వాగ్వివాదం చెలరేగింది. గంటకు పైగా శుక్రవారం ఉదయం ఆ విషయంపై వాగ్వివాదం జరిగింది. చేనేత కార్మికుల పరిస్థితిపై, నూతన ఆబ్కారీ విధానంపై తక్షణమే చర్చకు అనుమతించాలని తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ (బిజెపి)లు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ కె. ఆర్. సురేష్ రెడ్డి అంతకు ముందు త్రోసిపుచ్చారు. ఈ అంశాలపై ఇదివరకే చర్చ జరిగినందున మళ్లీ చర్చ అవసరం లేదని స్పీకర్ అన్నారు.
ఈ సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వివాదం చెలరేగింది. శాసనసభ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వం ఒక్క సమస్యనైనా పరిష్కరించిందా అని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు అడిగారు. అంశాలను సాగదీస్తూ తెలుగుదేశం పార్టీ సభ్యులు సభా సమయాన్ని వృధా చేస్తున్నారని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ సభ్యులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, సభ ప్రతిష్టకు భంగం కలుగుతోందని శాసనసభా వ్యవహారాల మంత్రి కె. రోశయ్య విమర్శిస్తూ ఈ విషయంపై రూలింగ్ ఇవ్వాలని స్పీకర్ కె. ఆర్. సురేష్ రెడ్డిని కోరారు. అధికారంలో ఉండి శాసనసభలో బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించడం ద్వారా కాంగ్రెస్ చరిత్ర సృష్టించారని తెలుగుదేశం సభ్యుడు యనమల రామకృష్ణుడు వ్యంగ్యంగా అన్నారు. ప్రతిపక్షాలు ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించడం సంప్రదాయంగా వస్తున్నదని, అధికార పక్షం వాటిని ప్రదర్శించడం ఇప్పటి వరకు లేదని ఆయన అన్నారు.
ప్రజా సమస్యలు చర్చకు రాకుండా ప్రభుత్వం చేస్తోందని, సభను కచ్చితంగా మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు వాయిదా వేయాలనడం సరి కాదని చంద్రబాబు అన్నారు. నాణ్యమైన పని కావాలని, రోజంతా సభ జరిగితే ఇతర పనులకు ఇబ్బంది కలుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు.