సచిన్ అర్థసెంచరీ అవుట్: భారత్ 133/3
కోల్కత్తా: భారత్ తన రెండో ఇన్నింగ్స్లో శుక్రవారం ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. వెలుతురు సరిగా లేకపోవడంతో ఆట ఏడు ఓవర్లు ఉండగానే ముగిసింది. సచిన్ టెండూల్కర్ మరోసారి సెంచరీ చేయలేకపోయాడు. టెండూల్కర్ 52 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అబ్దుల్ రజాక్ బౌలింగ్లో అక్మల్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. టెస్టు మ్యాచ్ల్లో సచిన్కు ఇది 41వ అర్థ సెంచరీ. రెండో ఇన్నింగ్స్లో భారత్ తన ఓపెనర్ల జంటను చాలా తొందరగా కోల్పోయింది. గౌతం గంభీర్ ఒక పరుగుకు, సెహ్వాగ్ 15 పరుగులకు సమీ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యారు. ఆ తర్వాత రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్ల జోడి సమయోచితంగా ఆడి భారత్ను గట్టెక్కించారు.
తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన ద్రావిడ్ రెండో ఇన్నింగ్స్లో శుక్రవారం ఆట ముగిసే సమయానికి 52 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సౌరబ్ గంగూలీ నాలుగు పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. అంతకు ముందు పాకిస్థాన్ తన తొలి ఇన్నింగ్స్లో 393 పరుగులకు అలవుట్ అయింది. శుక్రవారంనాడు పాకిస్థాన్ చాలా త్వరగా మిగతా ఎనిమిది వికెట్లను కోల్పోయింది. గురువారం సెంచరీ చేసి శుక్రవారం మైదానంలోకి దిగిన యోహానా కొద్దిసేపటికే బాలాజీ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యు అయ్యాడు. యూనిస్ ఖాన్ 147 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కుంబ్లే బౌలింగ్లో లక్ష్మణ్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇంజమామ్ వుల్ హక్ 30 పరుగులకే పెవిలియన్ దారి పట్టాడు. రజాక్ తప్ప మిగతావారెవరూ రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. రజాక్ 17 పరుగులు చేశాడు. ఇర్ఫాన్ పఠాన్, బాలాజీలకు శుక్రవారం నాడు చెరో వికెట్ లభించగా, కుంబ్లే మూడు వికెట్లు, హర్బజన్ సింగ్ రెండు వికెట్లు తీశారు.