ఉద్యమం నుంచి వైదొలుగుతున్నా: గోపన్న
రాజమండ్రి: మావోయిస్టు ఉద్యమం నుంచి వైదొలుగుతున్నట్లు సిపిఐ (మావోయిస్టు) ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు దళ కమిటీ నాయకుడు శేషగిరిరావు అలియాస్ గోపన్న ప్రకటించారు. కుటుంబ సభ్యుల, గ్రామస్థుల ఒత్తిడి మేరకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన శుక్రవారం విలేకరులతో చెప్పారు. తాను గత పదిహేనుల్లు ఉద్యమంలో ఉండి సేవ చేశానని ఆయన చెప్పారు. తాను ప్రశాంత జీవనం గడపాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. గోపన్నను పోలీసులు సెంట్రల్ జైలుకు తరలించారు.
పదిహేనేళ్లు ఉద్యమంలో సేవలందించావు కదా, ఇక నుంచైనా మా మధ్యను ఉండుమని తమ గ్రామస్థులు కోరారని, దీనితో తాను ఉద్యమం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని ఆయన వివరించారు. కేసులు, తదితర న్యాయపరమైన చిక్కులు ముగిసిన తర్వాత తాను గ్రామంలో ఉండి ప్రజలకు తనకు చేతనైన సహాయం చేస్తానని ఆయన అన్నారు. పోలీసులు తనను పకడ్బందీ పథకం ప్రకారం వల పన్ని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. తాను పోలీసులకు లొంగిపోలేదని, పోలీసులు వలపన్ని అరెస్టు చేశారని ఆయన చెప్పారు.