కానిస్టేబుల్ హత్య: కానిస్టేబుళ్ల రాస్తారాకో, జానా ఖండన
హైదరాబాద్: మావోయిస్టు నక్సలైట్ల హింస రాష్ట్రంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నది. నక్సలైట్లు శుక్రవారంనాడు మహబూబ్నగర్ జిల్లాలో ఒక కానిస్టేబుల్ను కాల్చి చంపారు. నల్లగొండ జిల్లాలో ఐదు బస్సులను దగ్ధం చేశారు. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్లో ప్రకాశ్ అనే కానిస్టేబుల్ను మోటార్ సైకిల్పై ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్తుండగా నక్సలైట్లు కాల్చి చంపారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో జరిగింది. ఈ సమయంలో సబ్ ఇన్స్పెక్టర్ కూడా అక్కడే ఉన్నారు. నక్సలైట్ల లక్ష్యం ఎస్ ఐ అని, అయితే ఎస్ ఐని చంపడం సాధ్యం కాకపోవడంతో కానిస్టేబుల్ను కాల్చి చంపినట్లు భావిస్తున్నారు. అయితే ఈ ఇద్దరు కూడా నక్సలైట్ల హిట్లిస్టులో లేరు.
కానిస్టేబుల్ హత్యతో ఆగ్రహం చెందిన మహబూబ్నగర్ జిల్లా కానిస్టేబుల్స్ ఆందోళనకు దిగారు. వారు రాస్తారోకో నిర్వహించారు. అధికారులు సముదాయించడంతో వారు ఆందోళనను మానుకున్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి, హోం మంత్రి కె. జానారెడ్డి వచ్చే వరకు నక్సలైట్ల చేతిలో హత్యకు గురైన కానిస్టేబుల్ అంత్యక్రియలు జరగనివ్వమని వారు హెచ్చరించారు. మావోయిస్టు ప్రతినిధులు వరవరరావు, కళ్యాణరావు, గద్దర్లను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. తమ విజ్ఞప్తులను మన్నించే వరకు తాము ఎవరికీ భద్రత కల్పించబోమని వారన్నారు.
కానిస్టేబుల్ హత్యను హోం మంత్రి కె. జానారెడ్డి ఖండించారు. సిద్ధాంత రాహిత్యమైన, అవగాహ రాహిత్యమైన చర్యల ద్వారా సాంఘిక మార్పు వస్తుందనుకోవడం భ్రమ మాత్రమేనని ఆయన అన్నారు. ప్రభుత్వం పకడ్బందీ వ్యూహంతో వ్యవహరిస్తూ ప్రజా మద్దతును తాము కూడగట్టుకుంటామని ఆయన చెప్పారు.
ఇదిలావుంటే, నల్లగొండ జిల్లా పెదవూర మండలం పోతులూరు గ్రామం వద్ద ఆరు బస్సులను సాయుధ నక్సలైట్లు దగ్ధం చేశారు. వీటిలో నాలుగు ఆర్టీసి బస్సులు కాగా, ఒకటి ప్రైవేట్ బస్సు. నక్సలైట్లు రోడ్డుకు అడ్డంగా లారీలను నిలిపేశారని, దాంతో బస్సులు ఆగిపోయాయని, ఈ సమయంలో నక్సలైట్లు వచ్చి గొడ్డళ్లతో డీజిల్ ట్యాంక్లను పగుల కొట్టి బస్సులకు నిప్పంటించారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. దీనితో ఆర్టీసికి 75 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా.