ఏప్రిల్ 1న అనంతపురం కోర్టులో సూరి హాజరు
అనంతపురం: తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరిని ఏప్రిల్ 1వ తేదీన అనంతపురం కోర్టులో హాజరుపరచాల్సిందిగా మెజిస్ట్రేట్ ఆదేశించారు. పరిటాల హత్యకు సూరి పథక రచన చేశాడని అనుమానిస్తున్నారు. సూరి ఆదేశాల మేరకే పరిటాలను హత్య చేశామని లొంగిపోయిన నిందితులు అంటున్నారు. జూబిలీహిల్స్ బాంబుల కేసులో సూరి జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అతను ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని చర్లపల్లి జైలులో ఉన్నాడు.
పరిటాల హత్య కేసులో విప్లవ దేశభక్త పులుల ( ఆర్పీటి) నాయకుడు పటోళ్ల గోవర్ధన్ రెడ్డిని, అనుచరుడు రామస్వామిని శుక్రవారం పోలీసులు అనంతపురం కోర్టులో హాజరు పరిచారు. వారిరువురికి 14 రోజుల పాటు జ్యుడిష్యల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గోవర్ధన్ రెడ్డిని తమకు అప్పగించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వచ్చే నెల 1వ తేదీ వరకు గోవర్ధన్ రెడ్డిని సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రాయలసీమలోని జనరక్షణ సమితి తమ ఆర్పీటి అనుబంధ సంస్థ అని గోవర్ధన్ రెడ్డి విలేకరులతో చెప్పాడు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే పరిటాల రవిని హత్య చేశామని ఆయన చెప్పుకున్నాడు. రవిని హత్య చేసిన జూలకంటి శ్రీనివాస్ రెడ్డి అలియాస్ మొద్దు శ్రీను, నారాయణ రెడ్డి తమ క్రియాశీలక కార్యకర్తలని అతను అన్నాడు. ప్రజాస్వామ్య విప్లవంలో భాగంగా తాము జనరక్షణ సమితి ఆధ్వర్యంలో ఫ్యాక్షన్ నాయకులను చంపాలని నిర్ణయం తీసుకున్నామని, మరికొంత మందిని చంపుతామని ఆయన చెప్పాడు. అయితే వారి పేర్లు వెల్లడించడానికి గోవర్ధన్రెడ్డి నిరాకరించాడు.
మద్దెలచెర్వు సూరి కూడా ఫ్యాక్షనిస్టే అయినప్పటికీ ఏకాకిగా మారి నిస్సహాయుడిగా మారాడని, అందువల్ల తమకు సూరిపై సానుభూతి ఉన్నదని, ఫ్యాక్షనిజాన్ని పరిటాల రవి వ్యవస్థీకృతం చేశాడని, అందుకే రవిని మట్టుబెట్టామని ఆయన అన్నాడు. ఫ్యాక్షనిజానికి వ్యతిరేకంగా గోవర్ధన్ రెడ్డి నినాదాలు చేస్తూ కోర్టులో అడుగు పెట్టాడు. గోవర్ధన్ రెడ్డి మాటలన్నీ బూటకమని తెలుగుదేశం పార్టీ నాయకులు కోర్టులోనే వాగ్వివాదానికి దిగారు.
పరిటాల రవికి కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్న మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరిని హైదరాబాద్లోని చర్లపల్లి జైలు నుంచి అనంతపురం జైలుకు తరలించడానికి అనుమతి ఇవ్వాలని సిబిఐ కోర్టును కోరింది.
ఇదిలావుంటే, పరిటాల రవి హత్య కేసులో మద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరి భార్య భానుమతిని అరెస్టు చేసేందుకు సిబిఐ సమాయత్తమవుతున్నట్లు సమాచారం. సిబిఐ జాయింట్ డైరెక్టర్ దూబే శుక్రవారంనాడు పరిటాల హత్య జరిగిన స్థలాన్ని పరిశీలించారు.