నివేదిక వచ్చేదాకా ప్రాజెక్టు పనులకు బ్రేక్
హైదరాబాద్: రాజోలిబండ మళ్లింపు పథకం ( ఆర్డియస్)పై కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న మినీ విద్యుత్ ప్రాజెక్టు పనులను నిపుణుల కమిటీ నివేదిక వచ్చే వరకు ఆపేస్తానని కాంట్రాక్టర్ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఆర్డీయస్పై మినీ విద్యుత్ ప్లాంటు నిర్మాణం వల్ల మహబూబ్నగర్ జిల్లా రైతులకు నష్టం వాటిల్లుతుందని, దాన్ని ప్రభుత్వం ఆపేయించాలని తెలుగుదేశం పార్టీతో సహా అన్ని పార్టీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. కాంట్రాక్టర్ సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తోడల్లుడు కావడంతో వివాదం మరింత సున్నితంగా మారింది.
కాంగ్రెస్ తెలంగాణ నాయకులు శుక్రవారంనాడు ఆర్డీయస్ను సందర్శించారు. ఆర్డీయస్పై విద్యుత్ ప్రాజెక్టును ఆపేయించాలని వీరు కూడా కోరుతున్నారు. వీరు భారీ నీటి పారుదల మంత్రి పొన్నాల లక్ష్మయ్యను కలుసుకున్నారు. నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లక్ష్మయ్య కాంగ్రెస్ నాయకులకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మిత్రపక్షం తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) కూడా ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆర్డీయస్పై మినీ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ మహబూబ్నగర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ స్థితిలో ప్రభుత్వం ఇరకాటంలో పడింది.