నల్లమలలో డంపు స్వాధీనం, సాగర్ కోసం గాలింపు
హైదరాబాద్: నల్లమల అడవుల్లో పోలీసులు భారీ యెత్తున మావోయిస్టుల డంపును, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గత నెల రోజులుగా పోలీసు బలగాలు నల్లమల అడవుల్లో విస్తృతంగా గాలింపు జరుపుతున్నారు. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల సమీపంలోని తమ్మనబైలు అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల డంపును స్వాధీనం చేసుకున్నారు. పెద్ద దోర్నాల సమీపంలో ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం జిల్లా చెంగలరాయపాడు వద్ద పోలీసులు మూడు మందుపాతరలను స్వాధీనం చేసుకున్నారు.
మావోయిస్టు నల్లమల ఈస్ట్ జోన్ కార్యదర్శి సాగర్ అలియాస్ ప్రతాపరెడ్డి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సాగర్ రెండు రోజుల క్రితం గుండ్లబ్రహ్మేశ్వరం వద్ద ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నాడు. రాష్ట్రంలో ఇద్దరు మావోయిస్టు జిల్లా కార్యదర్శులను ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో సాగర్ను ఎలానైనా పట్టుకోవాలనే ఉద్దేశంతో పోలీసు గాలింపు జరుగుతున్నట్లు సమాచారం. సోమవారంనాడు ఇక్కడే రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ (ఆర్యస్ఐ) శ్రీనివాసులు కాలువలో జారి పడి గాయపడ్డారు. ఆయనను కర్నూలు ఆస్పత్రికి తరలించారు. పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్వరణ్జిత్ సేన్, గ్రేహౌండ్స్ ఐజి దుర్గాప్రసాద్ నిన్న నల్లమల అడవుల్లో హెలికాప్టర్లో తిరిగారు. శ్రీనివాసులును ఆస్పత్రికి తరలించడానికే హెలికాప్టర్ తీసికెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. నల్లమలలో దిగే అవకాశం లేకపోవడంతో హెలికాప్టర్ కర్నూలులో దిగింది. డిజిపి, గ్రేహౌండ్స్ ఐజిల హెలికాప్టర్ పర్యటనతో అనేక అనుమానాలు బయలుదేరాయి.
కాగా, మావోయిస్టు నేతలు సాగర్, సుదర్శన్, విజయభాస్కర్లను పోలీసులు పట్టుకున్నట్లు కూడా ఊహాగానాలు చెలరేగాయి. అలాగే ఖమ్మంలో మావోయిస్టు నాయకులు బండి ప్రకాశ్, రవీందర్ రెడ్డిలు తమ భార్యలతో సహా పోలీసులకు చిక్కినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ విషయాలను పోలీసులు ఖండిస్తున్నారు. సాగర్, సుదర్శన్, విజయభాస్కర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని వుంటే కోర్టులో హాజరు పరచాలని మావోయిస్టు ప్రతినిధి వరవరరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వమే ప్రతీకార చర్యలకు దిగడం ఎంతవరకు సమంజసమని ఆయన అంటున్నారు.