ఇంద్రసేన్ భార్య పెట్రోల్ బంక్పై వివాదం
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు నల్లు ఇంద్రసేనారెడ్డి సతీమణి రేణుకకు కేటాయించిన పెట్రోల్ బంక్ స్థలంపై బుధవారం శాసనసభలో తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ స్థలం మలక్పేట శాసనసభా నియోజకవర్గంలోని వనస్థలిపురం సమీపంలో జాతీయ రహదారిపై ఉంది.
నిబంధనలకు విరుద్ధంగా ఇంద్రసేనారెడ్డి తన భార్యకు స్థలం ఇప్పించారని, ఆ స్థలాన్ని ఇంద్రసేనారెడ్డి భార్య తన భర్త పేరు మీద కాకుండా తండ్రి పేరు మీద రిజిష్టర్ చేయించుకున్నారని మలక్పేట కాంగ్రెస్ శాసనసభ్యుడు మల్రెడ్డి రంగారెడ్డి అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో బిజెపి శాసనసభా పక్ష నాయకుడు జి. కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ సమయంలో కొద్దిసేపు వాగ్వివాదం చెలరేగింది. నిబంధనల మేరకు ఇంద్రసేనారెడ్డి భార్యకు స్థలం కేటాయింపు జరిగిందని భారీ పరిశ్రమల మంత్రి బొత్సా సత్యనారయణ చెప్పారు. ఇంద్రసేనారెడ్డి భార్యకు పెట్రోల్ బంక్ స్థలం కేటాయింపు అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సభా సంఘానికి నివేదించింది.