16 మంది నక్సల్స్ లొంగుబాటు
హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో 16 మంది నక్సలైట్లు లొంగిపోయారు. వరంగల్ జిల్లాలో ఎనమండుగురు, అనంతపురం జిల్లాలో ఎనమండుగురు నక్సల్స్ లొంగిపోయారు. అనంతపురం జిల్లాలోని గుంతకల్లులో ఆరుగురు మావోయిస్టులు, ధర్మవరంలో ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు.
వివిధ గ్రూపులకు చెందిన ఎనమండుగురు నక్సలైట్లు బుధవారం డిఐజి మీనా ముందు వరంగల్లో లొంగిపోయారు. ఇందులో ఐదుగురు మహిళా నక్సలైట్లున్నారు. ఎనమండుగురిలో ఇద్దరు మావోయిస్టులు కాగా మిగతా వారు ప్రజాప్రతిఘటన, ప్రతిఘటన, జనశక్తి గ్రూపులకు చెందినవారు. కుటుంబ సమస్యలతో నక్సలైట్లలో చేరిన తమకు అక్కడ కూడా ఒరిగిందేమీ లేదని, దాంతోనే తాము లొంగిపోతున్నామని లొంగినవారన్నారు.
దమ్ముంటే నక్సలైట్లు ఆయుధాలు లేకుండా గ్రామాల్లోకి వెళ్లాలని, అప్పుడు వారికి ఉన్న ఆదరణేమిటో తెలుస్తుందని వరంగల్ పోలీసు సూపరింటిండెంట్ (యస్పి) స్టీఫెన్ రవీంద్ర ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రజల హక్కులను రక్షించేందుకే పోలీసులు పని చేస్తారని ఆయన చెప్పారు. నక్సలైట్లు ఆయుధాలతో సంచరిస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన అన్నారు. తుపాకులతో సంచరిస్తే తగిన సమాధానం చెప్తామని ఆయన అన్నారు. వరంగల్, ఖమ్మం జిల్లాల కార్యదర్శి యాదన్న ఎన్కౌంటర్పై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆయన అన్నారు.