700 కోట్లతో లక్ష మందికి ఉపాధి: హరీష్
హైదరాబాద్: రాజీవ్ యువశక్తి పథకం కింద వచ్చే ఏడాది 700 కోట్ల రూపాయలతో లక్ష మందికి ఉపాధి కల్పిస్తామని యువజన సర్వీసుల మంత్రి హరీష్రావు చెప్పారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో గురువారం మంత్రి ఆ విషయం చెప్పారు. రాజీవ్ యువశక్తి పథకం కోసం నాలుగు లక్షల దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు.
రాజీవ్ యువశక్తి పథకం రాజకీయ శక్తి పథకంగా మారిందని, నిబంధనలను తుంగలో తొక్కి కాంగ్రెస్ నాయకుల సిఫార్సులున్నవారికే లబ్ధి చేకూరుస్తున్నారని పయ్యావుల కేశవ్ (టిడిపి) అన్నారు. నోముల నర్సింహయ్య (సిపియం) కూడా రాజీవ్ యువశక్తి పథకం అమలు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎస్సి, ఎస్టి, బీసీ హాస్టళ్లలో ఖాళీలను భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాగ్యా నాయక్ గురవారం శాసనసభలో తెలిపారు. బాలికల హాస్టళ్లలో మహిళా సిబ్బంది నియామకానికి ప్రాధాన్యం ఇస్తామని ఆయన చెప్పారు. సంక్షేమ హాస్టళ్లలో బాలికలు గర్భం దాలుస్తున్న తీరుపై గోవింద నాయక్ (టిఆర్యస్) ఆందోళన వ్యక్తం చేశారు.