తిరుపతి భూముల అక్రమ ఆక్రమణలపై వాకౌట్
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) భూముల అక్రమ ఆక్రమణలపై ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించనందుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ సభ్యులు గురువారం శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. గత పదేళ్లుగా టిటిడి భూముల అక్రమ ఆక్రమణ జరుగుతోందని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. దీంతో అక్రమ ఆక్రమణలపై న్యాయవిచారణకు ఆదేశించాలని టిడిపి సభ్యులు డిమాండ్ చేశారు. అందుకు ప్రభుత్వం అంగీకరించలేదు.
టిటిడి భూముల రక్షణకు అన్ని చర్యలనూ తీసుకుంటామని, ఒక్క సెంటు భూమి కూడా అక్రమ ఆక్రమణకు గురి కాకుండా కాపాడుతామని మంత్రి చెప్పారు. అక్రమ ఆక్రమణలకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, ఇందుకు సంబంధించి కోర్టుల్లో కొన్ని కేసులను కూడా ప్రభుత్వం గెలిచిందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ సభ్యుడు ఆర్. చెంగారెడ్డి కూడా అక్రమ ఆక్రమణలపై ఆందోళన వ్యక్తం చేశారు.
తిరుపతిలో 2 వేల ఎకరాల అసైన్మెంట్ భూముల అక్రమ ఆక్రమణపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా సిపియం సభ్యులు గురువారం శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. కల్కి భగవాన్ పేరు విజయభాస్కర్ అనే వ్యక్తి దళితులకు అసైన్ చేసిన భూములను, ఇతర భూములను అక్రమంగా ఆక్రమించుకున్నాడని ప్రభుత్వం కూడా అంగీకరించిందని, అటువంటప్పుడు క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకాడుతోందని సిపియం సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈ అక్రమ ఆక్రమణలపై విచారణకు సభా సంఘం వేయాలనే సిపియం డిమాండ్ను ప్రభుత్వం తిరస్కరించింది.