వరంగల్ రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి
వరంగల్: వరంగల్ జిల్లాలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది మరణించారు. మరో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వరంగల్ జిల్లా రఘునాథపల్లె ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా ఈ ప్రమాదం సంభవించింది. జనగామ డిపోకు చెందిన ఆర్టీసి బస్సును, క్రూయేజర్ జీపు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. జీపులో ఉన్న 18 మందిలో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించగా, తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మరణించినట్లు సమాచారం. జీవు డ్రైవర్ కూడా చనిపోయాడు. సంఘటనా స్థలం రక్తసిక్తంగా మారింది. క్రూయేజర్ వాహనం తుక్కుతుక్కు అయింది.
హన్మకొండ నుంచి హైదరాబాద్కు వస్తున్న జీపు జనగాం నుంచి హన్మకొండకు వెళ్తున్న ఆర్టీసి బస్సును ఢీకొట్టింది. క్రూయెజర్ ఎదురుగా ఉన్న ట్రాక్టర్ను తప్పించబోయి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. జీపుతో పాటు ఆర్టీసి బస్సు కూడా అతి వేగంగా వెళ్తున్నందున ప్రమాదం నుంచి బయటపడలేకపోయాయి. గాయపడినవారిని వరంగల్లోని యంజియం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను జనగాం ఏరియా ఆస్పత్రికి తరలించినవారు. మృతులు హైదరాబాద్కు చెందినవారై ఉంటారని భావిస్తున్నారు.ప్రమాదానికి గురైన క్రూయేజర్ నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిందని తెలుస్తోంది.